హైదరాబాద్ : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఏడుగురు ఎంపీలు షిండేతో సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోపు వారంతా షిండే వర్గంలో చేరే అవకాశం ఉందని శివసేనకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే క్రిపాలు మానె వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ ఎంపీల విధేయతపై వస్తున్న ఊహాగానాలపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే మౌనం వీడారు.
పార్టీని వీడాలనుకునే వారిని తాను బలవంతం చేయబోనని స్పష్టం చేశారు. శివసేనను వీడాలనుకునే వారు నిశ్చింతగా వెళ్లిపోవచ్చన్న స్పష్టం చేశారు. పార్టీలో ఉండమని ఎవరిపైనా ఒత్తిడి చేయొద్దని నిర్ణయించు కున్నానని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన చీలిక గురించి ప్రస్తావిస్తూ.. బాలాసాహెబ్ థాకరే స్థాపించిన పార్టీని వీడిన వారు తమ నిర్ణయం పట్ల చివరికి పశ్చాత్తాపపడతారని థాకరే అన్నారు.
శివసేనను వీడాలని నిర్ణయించుకున్న వారు చివరికి చింతిస్తారని పేర్కొన్నారు. ఈ రోజు నాది కాకపోవచ్చు, కానీ రేపు కచ్చితంగా నాదే. అప్పటి వరకు మనం ఇలాంటివి భరించాల్సి ఉంటుందని థాకరే అన్నారు. కాగా, గతంలో థాక్రేతో కలిసి ఉన్న శివసేన నేత షిండే.. ఆ పార్టీలో చీలిక తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ మద్దతుతో గతంలో మహారాష్ట్ర సీఎంగా కూడా కొనసాగారు. ఇప్పుడు మరోసారి మిగిలిన ఉద్ధవ్ వర్గాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.