ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసా చదవడం బదులు ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసాల వద్ద హనుమాన్ చాలీసా పఠించాలని కాషాయ నేతలతో పాటు రాణా దంపతులకు శివసేన హితవు పలికింది. హనుమాన్ చాలీసా వివాదంపై కాషాయ పార్టీ తీరును శివసేన పత్రిక సామ్నా తప్పుపట్టింది. ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా జాతీయ స్ధాయిలో హనుమాన్ చాలీసా పఠించాలని అనుకుంటన్నారని, మాతోశ్రీకి బదులుగా ప్రధాని, లోక్సభ స్పీకర్ నివాసాల వద్ద ఆ పనిచేయాలని సామ్నా సంపాదకీయం పేర్కొంది.
దీని వెనుక నిస్ప్రహకు లోనైన బీజేపీ ప్రోద్బలం ఉందని ఆరోపించింది. కాగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని బెదిరించినందుకు ఎంపీ నవ్నీత్ రాణా, ఆమె భర్త రవి రాణాలపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రాణా దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ వరాలే బెంచ్ ఎదుట సోమవారం మద్యాహ్నం విచారణకు రానుంది.
ఇరు వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారని శనివారం నవనీత్ రాణా, రవి రాణాలను ముంబై పోలీసులు అరెస్ట్ చేయగా ముంబై కోర్టు 14 రోజుల కస్టడీకి తరలించింది. మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ రాణాను ఆదివారం రాత్రి బైకుల్లా మహిళా జైలుకు తరలించగా ఆమె భర్త బద్నేరా ఎమ్మెల్యే రవి రాణాను నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. ఎంపీ, ఎమ్మెల్యే జంటపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వారు ప్రభుత్వ యంత్రాంగాన్ని సవాల్ చేయడంతో పాటు సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు.