ముంబై : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా శివసేన విమర్శలు గుప్పించింది. దేశంలో ప్రస్తుత నియంత పాలన కంటే వారసత్వ పాలన నయమని పేర్కొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన స్వాగతించింది. రాహుల్ గాంధీ దుస్తులపై విమర్శించే బదులు ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ బదులివ్వాలని పార్టీ పత్రిక సామ్నా స్పష్టం చేసింది.
రాహుల్ తన పాదయాత్రలో లేవనెత్తిన ప్రశ్నలు కాషాయ పార్టీని ఇరుకునపెట్టాయని పేర్కొంది. రాహుల్ యాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని, నిరుదోగ్యం, రైతులు, కూలీలు, చిన్న మధ్యతరహా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని కోరింది.
రాహుల్ ప్రశ్నలకు బదులివ్వని బీజేపీ నేతలు ఆయన దుస్తులు, తీసుకునే ఆహారం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారని సామ్నా పత్రిక మండిపడింది. రాహుల్ ధరించిన టీ షర్ట్ ధరపై బీజేపీ చౌకబారు విమర్శలు చేస్తోందని అన్నారు. ప్రజల్లో రాహుల్ యాత్ర చైతన్యం తీసుకువస్తుండటంతో కాషాయ పార్టీకి కడుపు మంటగా ఉందని వ్యాఖ్యానించింది. దేశంలో పాతుకుపోయిన విద్వేష వాతావరణాన్ని భారత్ జోడో యాత్ర రూపుమాపుతుందని శివసేన పత్రిక ఆశాభావం వ్యక్తం చేసింది.