పనాజీ: ఆ రెండు పార్టీల టార్గెట్ బీజేపీ. మహారాష్ట్రలో అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగాయి. ఇక్కడ కూడా కలిసి పనిచేద్దామంటే హస్తం పార్టీ చెయ్యిచ్చింది. దీంతో కాంగ్రెస్కు కటిఫ్ చెప్పి మరో పార్టీతో జతకట్టింది శివసేన. గోవాలో కూడా మహా వికాస్ అఘాడీ ఏర్పాటు కుదరకపోవడంతో దీదీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నది.
మహారాష్ట్రలో లాగా మహా వికాస్ అఘాడీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాం, కానీ విఫలమయ్యామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒప్పుకోకపోవడంతో టీఎంసీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు గెలవలేకపోయిన పది సీట్లను మిత్రపక్షలు తమకు ఇవ్వాలని కోరారు.
గోవాలో శివసేన ఇప్పటికే ఎన్సీపీతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి డజను సీట్లలో పోటీచేయనున్నాయని గతవారం ప్రకటించాయి. కాగా, తొమ్మిది అభ్యర్థులతో కూడిన జాబితాను శివసేన ఇప్పటికే ప్రకటించింది. తాజాగా టీఎంసీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పడం గమనార్హం.