Bikram Singh Majithia : దాదాపు రూ.700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శిరోమణి అకాళీదల్ నేత బిక్రం సింగ్ మజితియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం బెయిల్పై ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలు, విచారణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది.
నిందితుడు ఏడు నెలలుగా జైల్లోనే ఉన్నాడని, అక్రమాస్తులు కలిగి ఉన్న సమయం 2007-2017 అని, ఎఫ్ఐఆర్ నమోదైంది 2025లో అని.. అందువల్ల 2025 నాటి పీసీ యాక్ట్ ప్రకారం బెయిల్ ఇస్తున్నామని కోర్టు చెప్పింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి బిక్రం సింగ్పై సిట్ 2025 జూన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వెంటనే అతడిని అమృత్ సర్లోని తన ఇంటి నుంచి పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (వీబీ)కి చెందిన పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు న్యూ నభా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దీంతో బిక్రం సింగ్.. పంజాబ్, హరియాణా హైకోర్టులో గతంలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. తర్వాత అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఈ కేసులో గత ఆగష్టులోనే పోలీసులు సప్లిమెంటరీ ఫైల్స్తోకలిపి 40,000 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. పంజాబ్కు చెందిన మజితియా శిరోమణి అకాళిదల్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. ఈ సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలొచ్చాయి. 2007-2017 మధ్య కాలంలో ఆయన, అతడి భార్య కలిపి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు రావడంతో పంజాబ్ విజిలెన్స్ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.