ముంబై: మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈఏడాది ఏప్రిల్ నెలలో సాయిబాబా ఆలయం మూతపడిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ప్రార్థనాలయాలను తెరవడానికి గత నెల 24న ప్రభుత్వం అనుమతించింది. దీంతో గురువారం నుంచి ఆలయాన్ని పునఃప్రారంభించాలని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. ఏడు నెలల తర్వాత సాయిబాబాను భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటించాలని, మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది.
అయితే ప్రతిరోజు 15,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేల ఆన్లైన్ పాసులు, 5 వేల ఆఫ్లైన్ పాసులు ఉంటాయి. అంటే గంటకు దాదాపు 1,150 మంది షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవచ్చు. ఆర్తి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. గర్భిణిలు, 10 ఏండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులను ప్రస్తుతం అనుమతించడం లేదు.