Eknath Shinde |మహారాష్ట్రలో అధికార శివసేనలో నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. తనకు 42 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే.. తిరుగుబాటు చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రస్తుత మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి షిండే గ్రూప్ వైదొలగడం ఖాయంగా కనిపిస్తున్నది. బీజేపీతో తిరిగి పొత్తు పునరుద్ధరించాలని కోరుతున్న షిండే.. ఆయన గ్రూప్ నుంచి 2014లోనూ ఇదే పరిస్థితి వచ్చిందని తెలుస్తున్నది. ఒకవేళ బీజేపీతో వెళ్లకుంటే తిరుగుబాటు తప్పదని వార్తలు రావడంతో రెబెల్స్ ఒత్తిడికి ఉద్ధవ్ తలొగ్గారని సమాచారం.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ విడివిగా పోటీ చేశాయి. శివసేనకు 63, బీజేపీ 122 సీట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా శివసేనతో అధికారం పంచుకోవాలని బీజేపీ భావించింది. కానీ సీఎం పదవి రెండున్నరేండ్లు షేర్ చేసుకోవాలన్న అంశం అడ్డంకిగా మారింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అభ్యర్థిత్వంపై ఉద్ధవ్ ఠాక్రేకు అభ్యంతరాలు ఉన్నాయి. ఫడ్నవీస్కు బదులు నితిన్ గడ్కరీని సీఎంను చేయాలని ఉద్ధవ్ ఠాక్రే కోరుకున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఫడ్నవీస్లపై శివసేన దుమ్మెత్తి పోసింది. ఫడ్నవీస్తో కలిసి ముందుకెళ్లడానికి ఉద్ధవ్కు ఇష్టం లేదు. కానీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై 25 మంది ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరించారని సమాచారం. శివసేన అంతర్గత సమావేశాల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వానికి వెళ్లకుంటే తాము విడిపోతామని ఏక్నాథ్ షిండే గ్రూప్ ఎమ్మెల్యేలు హెచ్చరించారని వినికిడి.
2014 ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యూహాత్మకంగా పాచిక విసిరింది. మహారాష్ట్రలో.. బీజేపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది.. రాష్ట్రంలోనూ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధం అని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ చెప్పారు. ఒకవైపు సొంత ఎమ్మెల్యేల ఒత్తిడి, మరోవైపు ఎన్సీపీ ప్రకటనతో పార్టీ దెబ్బ తినకుండా బీజేపీతో కలిసి పని చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే ముందుకు వచ్చారని సమాచారం.
బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కమలనాధులను వ్యతిరేకించడానికే ఉద్ధవ్ ప్రాధాన్యం ఇచ్చేవారని వినికిడి. ఉద్ధవ్ గ్రూప్ నేతలు బీజేపీ ఆర్థిక, రాజకీయ విధానాలను వ్యతిరేకించడంలో చురుగ్గా ఉన్నారని వార్తలొచ్చాయి. పాత పెద్ద నోట్ల రద్దు మొదలు.. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు, ముంబై మెట్రో కోసం ఆరే కాలనీ తరలింపు తదితర అంశాల్లో బీజేపీని ఉద్ధవ్ గ్రూప్ వ్యతిరేకించిందని తెలుస్తున్నది.
2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కావాలని ఉద్ధవ్ ఠాక్రే తలపోశారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ, శివసేన విజయం మీద విశ్వాసంతో అధిక సీట్లు కావాలని సిగపట్లకు దిగాయి. మోదీ వేవ్ అయిపోయిందని శివసేన భావించినా.. మరాఠీల్లో ప్రభావం గల నేతగా మోదీ ఉన్నారు. అందుకే 2014 లోక్సభ ఫలితాలు పునరావృతం అవుతాయని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నది.
శివసేన యువ విభాగం అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే 2014 జూలైలో `మిషన్ 150`ప్రచారోద్యమం చేపట్టారు. ఉద్ధవ్ ఠాక్రేను సీఎంను చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. రెండు పార్టీల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి దీన్ని బీజేపీ పరిగణనలోకి తీసుకోలేదు.