ముంబై : ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఎన్నికల కమిషన్కు మరో మూడు గుర్తులను ఎంపిక చేసి పంపింది. శివసేన పార్టీ రెండువర్గాలు విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం, ఏక్నాథ్ షిండే వర్గాలు అసలైన శివసేన మాదంటే మాది అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెలలో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు శివసేన ఎన్నికల గుర్తు విల్లు-బాణం గుర్తును తమకే కేటాయించాలని ఇరువర్గాలు ఎన్నికల కమిషన్ను కోరాయి. దీంతో ఈసీ పార్టీ పేరుతోపాటు ఎన్నికల గుర్తును ఇరువర్గాలు వాడకుండా ఫ్రీజ్ చేసింది.
ఎన్నికల సందర్భంగా ఇరువర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తులకు సంబంధించి ఆప్షన్స్ ఇస్తే.. అందులో ఏదో ఒకటి కేటాయిస్తామని చెప్పింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరు, ‘కాగడా’ గుర్తును ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. ఏక్నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహెబ్చీ శివసేన’ పేరును ఖరారు చేసి, ఎన్నికల గుర్తు కోసం మరో మూడు గుర్తులను ఎంచుకొని పంపాలని సూచించింది. దీంతో మరోసారి షిండే వర్గం షైనింగ్ సన్, కవచం – కత్తి, పీపల్ వృక్షం గుర్తులను ఎంపిక చేసి.. ఎన్నికల కమిషన్కు పంపింది. అంతకు ముందు త్రిశూలం, గద గుర్తులను కేటాయించగా.. ఇరువర్గాలు కోరగా.. వాటిని కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది.