కోజికోడ్: కేరళలో షిజెల్లా బ్యాక్టీరియా(Shigella Bacteria) కలకలం రేపుతున్నది. కోజికోడ్ జిల్లాలో ఓ మూడేళ్ల చిన్నారి ఆ బ్యాక్టీరియా సోకి మరణించింది. దీంతో ఆ జిల్లాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. షిజెల్లా బ్యాక్టీరియా సోకిన వారు అధిక ఉష్ణోగ్రతలతో, జ్వరంతో, మూర్ఛ లాంటి లక్షణాలతో బాధపడుతారు. ఆ చిన్నారి ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తొలుత డాక్టర్లు అంచనా వేశారు. కానీ చివరకు షిజెల్లా బ్యాక్టీరియాతో ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించారు. ఆ చిన్నారితో టచ్లోకి వచ్చిన సుమారు 11 మందికి కూడా బ్యాక్టీరియా సోకినట్లు అంచనా వేశారు.
వేర్వేరు ఆస్పత్రిల్లో ప్రస్తుతం అయిదుగురు చిన్నారులు అబ్జర్వేషన్లో ఉన్నారు. ఆందోళనలు పెరగడంతో వయోవృద్ధులను కూడా డాక్టర్లు పరిశీలిస్తున్నారు. కోజికోడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీలను మూసివేశారు. ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. డోర్ టు డోర్ అవేర్నెస్ ప్రచారం నిర్వహిస్తున్నారు. షిజెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి, మలంలో రక్తం లాంటి సమస్యలతో బాధపడుతారు. పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, కలుషిత నీరు వల్ల షిజెల్లా వ్యాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.