హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అమలుపై అస్సాం ఎన్జీవో బృందం ప్రశంసలు కురిపించింది. పథకం అద్భుతంగా ఉన్నదని, దీని ద్వారా వృత్తి రక్షణతోపాటు గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కలుగుతుందని కితాబిచ్చింది. అస్సాంలో గొర్రెల పెంపకం అభివృద్ధి, గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఐసీసీవో అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అలయ్ బారా, డాక్టర్ బసంత్కుమార్ బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించింది.
రామాయంపేట మండలం కాంట్రాల గ్రామంలోని లబ్ధిదారులతో బృందం సభ్యులు ముచ్చటించారు. ఆ తర్వాత షీప్ ఫెడరేషన్ ఎండీ రాంచందర్తో భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని, తమ రాష్ట్రంలో అమలు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గోసుల శ్రీనివాస్, గోవర్ధన్, రాంచంద్రుడు, ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.