Shashi Tharoor | ప్రతి రాజకీయ పార్టీలోనూ కొంత వరకు ఫ్యాక్షనలిజం ఉంటుందని, కానీ, నాయకులు ఉమ్మడి లక్ష్యంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య కుమ్ములాటల నేపథ్యంలో శశి థరూర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వద్ద శశిథరూర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ `ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకే అంశంపై సిద్ధాంతపరంగా పోటీ పడొచ్చు. అప్పుడు పార్టీ ఏం చెప్పిందనేది ముఖ్యం. ప్రతి పార్టీలోనూ చిన్న ఫ్యాక్షన్లు ఉంటాయన్నది నిజం. కానీ, మేమంతా బీజేపీకి వ్యతిరేకం. పెద్ద అంశాలతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్న అంశాలు` అని అన్నారు.
సచిన్ పైలట్ను ఉద్దేశించి గెహ్లాట్ ఇటీవల మాట్లాడుతూ కరోనా మహమ్మారి తర్వాత పార్టీలో `పెద్ద కరోనా` చొరబడిందని వ్యాఖ్యానించారు. దీనిపై సచిన్ పైలట్ శుక్రవారం స్పందిస్తూ.. పెద్దలు యువతరం గురించి, యువతకు న్యాయం చేసే అంశంపై ఆలోచించాలని సూచించారు. ఎనిమిదేండ్ల క్రితం న్యూజీలాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జసిండా అర్డెన్.. ఇటీవల రాజీనామా చేసి పార్టీకోసం పని చేస్తానని చెప్పారని పైలట్ గుర్తు చేశారు.
సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్టీ నేతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి స్పందించాలని శశిథరూర్ సూచించారు. `మనం మన పార్టీ సహచరుల గురించి మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి స్పందించాలి. 14 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నందుకు గర్వంగా ఉంది. నేను ఎవరిని ఉద్దేశించి అటువంటి పదజాలం వాడలేదు` అని అన్నారు.
పార్టీ నేతల గురించి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించొద్దని శశి థరూర్ సూచించారు. పూర్తిగా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే పరిష్కార మార్గాలు వెతుకొచ్చునన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్గాంధీ ప్రతిష్ట పునః ప్రతిష్టించబడిందన్నారు.