Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసిన అనంతరం దేశవ్యాప్తంగా విపక్ష ఇండియా కూటమికి సానుకూల వాతావరణం ఉన్నట్టు వెల్లడవుతోందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. బీజేపీ మెజారిటీ మార్క్కు దూరంగా నిలుస్తుందని చెప్పారు. ఇది దేశంలో ఏ ఒక్క ప్రాంతంలో కాదని, ప్రతిచోటా ఇదే వాతావరణం ఉందని అన్నారు.
తమ అభ్యర్ధుల్లో ఉత్సాహం నెలకొనగా, బీజేపీ అభ్యర్ధుల్లో నైరాశ్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గుముఖం పట్టిందని, తాము ఎన్ని స్ధానాలు దక్కించుకుంటామనే సంఖ్యను వెల్లడించకున్నా ట్రెండ్ మాత్రం ఓ నిర్ధిష్ట దిశగా సాగుతున్నట్టు అర్ధమవుతోందని అన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నాడు కేంద్రంలో ప్రభుత్వం మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్సభలో ప్రస్తుతం బీజేపీకి 303 మంది సభ్యులు ఉండగా, వారు మెజారిటీ మార్క్కు చాలా దిగువకు పడిపోనున్నారని, ఎన్డీయే కూటమి పక్షాలు కూడా బీజేపీకి మెజారిటీ సాధించి పెట్టే పరిస్ధితి ఉండదని శశి థరూర్ అంచనా వేశారు. లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా ఇప్పటికి ఐదు దశలు పూర్తయ్యాయి. మే 25, జూన్ 1న చివరి రెండు దశల పోలింగ్ జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
Read More :