న్యూఢిల్లీ : అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్పధ్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ నేతలు దీపేందర్ హుడా, జై ప్రకాష్ అగర్వాల్, విజయేంద్ర సింగ్లతో కలిసి శశి థరూర్ సోనియాతో సమావేశమయ్యారు.
పార్టీ అధ్యక్ష పదవికి శశి థరూర్ పోటీ చేస్తారనే సంకేతాలు వెల్లడైనా ఆయన బాహాటంగా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు వెల్లడించలేదు. శశి థరూర్ పార్టీలో అసంతృప్త నేతలుగా గుర్తింపు పొందిన జీ23 నేతలతో లేకున్నా పార్టీలో సంస్కరణలకు అనుకూలంగా ఆయన పలుమార్లు మాట్లాడారు.
పార్టీని సంస్ధాగతంగా ప్రక్షాళన చేయాలని అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీ నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని జీ23 నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.