న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్, కాంగ్రెస్ రహిత భారత్ నినాదాలు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్తో కూడిన బీజేపీగా కాషాయ పార్టీ మారిందని శశి థరూర్ ఎద్దేవా చేశారు.
సింగ్ నిష్ర్కమణపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానిస్తూ తన భావజాలానికి కట్టుబడి ఉండలేనివాడు మన స్వంతం కాలేడని అన్నారు. దేశాన్ని 80శాతం వర్సెస్ 20 శాతంగా విభజించే వారిని ఓడించాల్సిన అవసరం ఉందని ఖేరా కోరారు. ఓటర్ల మధ్య మతపరమైన విభజన తీసుకువచ్చేందుకే యూపీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విపక్షం భగ్గుమంటోంది. మరోవైపు కేవలం పిరికివాళ్లే పూర్తి విరుద్ధమైన భావజాలం ఉన్న పార్టీల్లో చేరతారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనటె వ్యాఖ్యానించారు.
బీజేపీ, కాంగ్రెస్ నడుమ సైద్ధాంతిక పోరాటం సాగుతోందని, ఈ పోరులో నిలిచి గెలవాలంటే ధైర్యంగా ముందుకెళ్లాలని అన్నారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో సింగ్ నిష్క్రమణ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.