ముంబై/పూణె మార్చి 4: బీజేపీకి కంచుకోట లాంటి మహారాష్ట్రలోని కస్బాపేఠ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓడిపోవడం ద్వారా ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనేది స్పష్టమవుతున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ… దేశంలో మార్పు పవనాలు వీస్తున్నాయని, ఇందుకు కస్బాపేఠ్ ఫలితమే రుజువు అని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేవలం నామమాత్రంగా ఉన్నదన్నారు. ఓట్లు వేసే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూల్చిందో ప్రజలు గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు.
200 అసెంబ్లీ, 40 లోక్సభ సీట్లు గ్యారెంటీ : సంజయ్ రౌత్
కస్బాపేఠ్ ఉప ఎన్నికలో మహావికాస్ అఘాడి విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, ఇక మహారాష్ట్రలో గెలుపు మిగిలి ఉన్నదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. తమ కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో 200 అసెంబ్లీ, 40 లోక్సభ సీట్లు గెలుచుకోవడం ఖాయమని అన్నారు. కస్బాపేఠ్లో బీజేపీ ఓట్లు కొని గెలిచేందుకు ప్రయత్నించి విఫలమైందన్నారు.