ముంబై: శివసేన పార్టీ గుర్తు వివాదంలో తాను జోక్యం చేసుకోబోనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ తెలిపారు. మహారాష్ట్రలోని పూణెలో మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘శివసేన పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి ఈసీ కేటాయించిన వివాదంలో నేను జోక్యం చేసుకోదలచుకోలేదు. రెండు రోజుల కిందటే నా అభిప్రాయాన్ని స్పష్టం చేశాను’ అని అన్నారు. ఒకసారి ఈసీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై చర్చ అనవసరమన్న శరద్ పవర్, కొత్త గుర్తును స్వీకరించాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. ఈసీ నిర్ణయంపై పెద్దగా ప్రభావం ఉండదని, పాత గుర్తు కోల్పోయినప్పటికీ కొత్త గుర్తును ప్రజలు ఆదరిస్తాని చెప్పారు. గతంలో కాంగ్రెస్ కూడా పార్టీ గుర్తును మార్చుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు.
కాగా, కేంద్ర మంత్రి అమిత్ షా, తన మధ్య ఎలాంటి విభేదాలు లేవని శరద్ పవార్ తెలిపారు. ఇటీవల ఆయనతో జరిగిన భేటీ గురించి ప్రస్తావించారు. సహకార మహా సమ్మేళనం ప్రారంభ వేడుకకు హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షాతో తాను మాట్లాడినట్లు తెలిపారు. సహకార రంగానికి సంబంధించిన విధానాలు, సమస్యల గురించి తమ మధ్య చర్చ జరిగిందని చెప్పారు. అమిత్ షా ప్రసంగంలోని అంశాలు సరిగానే ఉన్నాయని శరద్ పవార్ అన్నారు.
మరోవైపు శివసేన పార్టీ పేరు, విల్లు బాణం గుర్తును వదులుకునే ప్రసక్తే లేదని ఉద్ధవ్ ఠాక్రే వర్గం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వీటిని షిండే వర్గానికి కేటాయించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. కాగా, రూ.50 కోట్లకు శివసేన ఎమ్మెల్యేలను కొని వారు తిరుగుబాటు చేసేలా చేసినట్లుగానే శివసేన పార్టీ పేరు, విల్లు బాణం గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడం వెనుక రూ.2,000 కోట్ల డీల్ జరిగిందని ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు త్వరలో బయటపెడతానని ఆయన చెప్పారు.