ముంబై: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను తగ్గించడాన్ని ఇది ఎత్తిచూపుతున్నదని, ఇది ఖండించదగిన చర్య అని ఆయన మండిపడ్డారు. కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని సూరత్ కోర్టు గత గురువారం పరువునష్టం కేసులో దోషిగా తేల్చింది. ఆ తర్వాత రోజే రాహుల్ లోక్సభ సభ్యత్వంపై వేటుపడింది.
2019లో కర్ణాటక ఎన్నికల ర్యాలీలో “మోదీ ఇంటిపేరు”కు సంబంధించి రాహుల్గాంధీ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. అతనిపై సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదైంది. రెండేళ్ల నాటి ఈ కేసులో కోర్టు రాహుల్గాందీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, కోర్టు రాహుల్కు బెయిల్ కూడా మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవడంలో తీర్పుపై 30 రోజుల సస్పెన్షన్ కూడా విధించింది.
కాగా, హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన తర్వాత లక్షద్వీప్కు చెందిన ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్పై అనర్హత వేటు పడటాన్ని కూడా పవార్ ప్రస్తావించారు. ఫైజల్ శిక్షను కేరళ హైకోర్టు సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ, ఫైజల్లపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని, ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, ఇది ఖండించదగినదని పవార్ ట్వీట్ చేశారు.