న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. పాలక పక్షాన్ని ఇరుకున పెట్టడానికి కేంద్రంలోని బీజేపీ శథవిధాలా ప్రయత్నిస్తున్నది. ఓవైపు అధికార శివసేన ఎంపీ ఇంటిపై ఈడీ దాడులు చేస్తుండగా, మరోవైపు మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామి ఎన్సీపీ అధినేత ఇచ్చిన విందుకు కేంద్ర మంత్రి కూడా పాల్గొనడం ఆసక్తి రేకెస్తున్నది.
కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మంగళవారం రాత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి మహారాష్ట్రలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ దావత్కు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడి చేసి, వెయ్యి కోట్ల విలువైన ఆయన ఆస్తులను జప్తు చేసింది. అది జరిగిన మూడు, నాలుగు గంటల వ్యవధిలోనే షరద్ పవార్ ఇంట్లో నితిన్ గడ్కరీ ప్రత్యక్షమవడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఆ దావత్లో రౌత్ కూడా ఉండటం విశేషం.
కాగా, రాష్ట్ర ఎమ్మెల్యేలకు రెండు రోజుల శిక్షణలో భాగంగా పార్లమెంటుకు వచ్చారని, ఈ నేపథ్యంలో శరద్ పవార్ వారికి విందు ఇచ్చారని మహారాష్ట్ర మాజీ సీఎం పృద్వీరాజ్ చౌహాన్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని వెల్లడించారు.