న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను దీటుగా ఎదుర్కొనేందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మధ్య సోమవారం ఢిల్లీలో జరిగిన భేటీతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. ఇది రొటీన్ సమావేశమేనని పవార్ తో సమావేశం అనంతరం ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. మరోవైపు 15 పార్టీలతో కూడిన విపక్ష ప్రతినిధులను మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశానికి హాజరు కావాలని పవార్ ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది.
టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా ప్రారంభించిన రాజకీయ సంస్థ రాష్ట్ర మంచ్ శరద్ పవార్ నివాసంలో సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో ఎన్సీపీకి చెందిన మజీద్ మీనన్, ఎస్పీ నేత ఘన్శ్యామ్ తివారీ తదితర నేతలు పాల్గొననున్నారు. ఇక పవార్-ప్రశాంత్ కిషోర్ మధ్య జూన్ 12న ముంబైలో తొలి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజా భేటీలో ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్, పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కీలక నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ హాజరు కాలేదు. పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో కాషాయ పార్టీని దీటుగా ఎదుర్కొనే దిశగా చర్చలు సాగినట్టు సమాచారం.