ముంబై : నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(NCP) రెండుగా చీలిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్(Ajit Pawar) చేరడంతో.. ఇప్పుడు శరద్ పవార్(Sharad Pawar) ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే ఇవాళ రెండు వర్గాలు ముంబైలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నాయి. ఏ దళానికి ఎంత మంది ఎమ్మెల్యే బలం ఉందో తేలనున్నది.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ విప్ జారీ చేసింది. నారీమన్పాయింట్లో మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనున్న సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరుకావాలని ఆదేశించారు. జితేంద్ర అవద్ ఆ విప్ జారీ చేశారు. ప్రస్తుతం ఆయనే పార్టీ చీఫ్ విప్గా ఉన్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న 83 ఏళ్ల శరద్ పవార్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ అభిమానులు పోస్టర్ల ప్రచారం కూడా లాంచ్ చేశారు.
ఇక బాంద్రాలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ప్రత్యేక మీటింగ్ను నిర్వహిస్తోంది. ఇది ఉదయం 11 గంటలకు జరగనున్నది. తమ మెజారిటీని చూపించేందుకు అజిత్ దళం సిద్ధంగా ఉంది. కొన్ని రోజుల క్రితం అజిత్ పవార్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేసి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అదే రోజున 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేశారు.
మహా అసెంబ్లీలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తనకు 43 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు అజిత్ పవార్ తెలిపారు. కానీ శరద్ పవార్ గ్రూపునకు చెందిన జయంత్ పాటిల్ మాత్రం ఆ వాదనలను కొట్టిపారేశారు. ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన అజిత్ పవార్తో పాటు 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ను శరద్ పవార్ పార్టీ కోరింది.