Minister Narayan Rane | న్యూఢిల్లీ, జనవరి 14: అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాబోమని, ఆ కార్యక్రమం పూర్తిగా రాజకీయ కార్యక్రమంలా ఉందని నలుగురు శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె శనివారం విమర్శలు గుప్పించారు. అసలు హిందూ మతానికి శంకరాచార్యులు చేసిన సేవ ఏమిటని ఆయన ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ, బీజేపీని రాజకీయ దృష్టితోనే చూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం పూర్తిగా మతానికి సంబంధించినది. ఇది మన ధర్మం.
రాముడు మన దేవుడు. జరుగుతున్నదంతా ఆయన కోసమే’ అని నారాయణ్ అన్నారు. రాణె వ్యాఖ్యలపై ఆదివారం విపక్షాలు భగ్గుమన్నాయి. ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని, దీనిపై బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని శివసేన (యూబీటీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హిందూ మతానికి శంకరాచార్య ఏం సేవ చేసారంటూ ప్రశ్నించిన రాణె మొత్తం హిందూ మతాన్నే అవమానించారని అన్నారు. నారాయణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీయే బాధ్యత వహించాలని శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే కోరారు. శంకరాచార్యులపై రాణె వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముంబైలోని నారాయణ్ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని సాంస్కృతిక శాఖ పలు ఏర్పాట్లు చేస్తున్నది. 2,500 మంది జానపద కళాకారులతో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నగరవ్యాప్తంగా 100 వరకు స్టేజీ ప్రదర్శనలు ఉంటాయని తెలిపాయి. మరోవైపు దేశ, విదేశాలకు చెందిన 5 వేల మంది కళాకారులు అయోధ్యలో జనవరి 14 నుంచి మార్చి 24 వరకు 70 రోజుల పాటు వివిధ రకాల ప్రదర్శనలు ఇస్తారని అధికారులు తెలిపారు. 15 దేశాలకు చెందిన ఆర్టిస్టులు రామ్లీలా నాటకం ప్రదర్శిస్తారని వెల్లడించారు.
రామ మందిర ప్రారంభాన్ని పురస్కరించుకుని పవిత్ర గ్రంథం రామచరితమానస్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో అడిగినన్ని గ్రంథాలను సరఫరా చేయలేక తమ వెబ్సైట్ నుంచి ఈ గ్రంథాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి గీతా ప్రెస్ అనుమతినిచ్చింది.
అయోధ్య ప్రారంభోత్సవానికి వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకుల సౌకర్యార్థం కొత్తగా 75 ఎలక్ట్రిక్ వాహనాలను ఏర్పాటు చేశారు. వీటిలో 50 బస్సులు, 25 ఆటోలు ఉన్నాయి. వీటిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు.
వారం రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవ క్రమంలో అయోధ్యలో ఆతిథ్య రంగం జోరందుకుంది. రానున్న రోజుల్లో ఇక్కడకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్న అంచనాతో ఏర్పాటు చేయబోయే వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ హోటళ్లు ఇక్కడ తమ బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే 50కి పైగా పెద్ద హోటళ్ల నిర్మాణం ఇక్కడ జరుగుతున్నది.