(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసులో అరస్టైన ప్రధాన నిందితుడు, తృణమూల్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ను సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రం ఎట్టకేలకు అదుపులోకి తీసుకొన్నారు. దీంతో బెంగాల్ ప్రభుత్వానికి, సీబీఐ అధికారులకు మధ్య రెండురోజులుగా జరుగుతున్న హైడ్రామాకు తెరపడినట్లయింది. సందేశ్ఖాలీ దర్యాప్తును బెంగాల్ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయాలని, నిందితుడు షాజహాన్ను సీబీఐ కస్టడీకి ఇవ్వాలని మంగళవారం కలకత్తా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, నిందితుడిని అప్పగించడంలో తొలుత తాత్సారం చేసిన బెంగాల్ సర్కారు.. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం 6.48 గంటలకు షాజహాన్ను సీబీఐ కస్టడీకి అప్పగించింది.