న్యూఢిల్లీ : తల్లిదండ్రులతో కలిసి వివాహ వేడుకకు వచ్చిన ఆరేళ్ల బాలిక అత్యాచారం జరిగింది. ఈ దుర్ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని రంజిత్నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్నది. పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి సదరు బాలికను బుక్ ఇస్తానని ఖాళీగా ఉన్న గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఓ గదిలో రక్తపు మడుగులో పడి ఉండడం గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నది.
బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో పూసారోడ్డుకు చెందిన నరేశ్కుమార్ (28) అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి, అరెస్టు చేశారు. పోక్సో, లైంగిక దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి కుటుంబం రంజిత్నగర్ ప్రాంతంలో నివస్తున్నది. ఆదివారం బాలిక కుటుంబం ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్కు వెళ్లింది.
ఈ సమయంలో కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండడంతో చిన్నారి ఆడుకుంటున్నది. ఈ క్రమంలో నరేశ్ కన్ను బాలికపై పడింది. బాలికకు బుక్ ఇస్తానని ప్రలోభపెట్టి ఓ గదిలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఇంతలో కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు భవనం ప్రాగణంలో వెతికారు. కొద్దిసేపటి తర్వాత ఓ గదిలో రక్తపు మడుగులో పడి ఉంది.
వెంటనే ఆసుప్రతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. నిందితుడు బాలికను తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డవగా.. నిందితుడి అరెస్టు చేశారు. దారుణానికి పాల్పడిన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.