న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ప్రభుత్వం మధ్య అధికారాల విషయంలో 2018లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చిందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కానీ ఎల్జీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఎల్జీ సక్సేనాతో భేటీ అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. ‘ఢిల్లీలో అధికారాలు రెండుగా విభజించి ఉన్నాయి. ఒకటి రిజర్డ్ సబ్జెక్ట్ కాగా రెండోది ట్రాన్స్ఫర్డ్ సబెక్టు. రిజర్డ్ సబ్జెక్టు కిందకు పోలీసులు, భూమి, పబ్లిక్ ఆర్డర్ వస్తాయి. వీటి విషయంలో ఎల్జీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు.
ఇవిగాక మిగిలినవన్నీ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టు కిందకు వస్తాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకోవచ్చు. కానీ ఎల్జీ మాత్రం ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టుల్లోనూ వేలు పెడుతున్నారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రభుత్వ నిధులను వాడుకున్నట్టు ఆరోపిస్తూ రూ.164 కోట్లు కట్టాలని లేకుంటే తీవ్రమైన చర్యలుంటాయని బెదిరిస్తున్నారు. అసలు మున్సిపాలిటీకి, ఎల్జీకి ఏమిటి సంబంధం? ప్రభుత్వం తాను అమలు చేసే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారం నిర్వహిస్తున్నది. ఇది తప్పా? ఇప్పటికైనా ఎల్జీ తన అధికార పరిధిలోనే వ్యవహరిస్తే బాగుంటుంది’ అని కేజ్రీవాల్ అన్నారు.