జమ్మూ కశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం రాంబన్ జిల్లాలో 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడడం, కెఫెటేరియా, మెహద్ వద్ద వ్యూహాత్మక రహదారికి ఎదురుగా ఉన్న కొండల నుంచి రాళ్లు ఎగిరిపడుతుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
కశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక హైవేను త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జమ్మూ నగరం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో జమ్మూ నగరంలో 95.7 మి.మీ., ఉదంపూర్లో 92.6 మి.మీ., కతువాలో 42.0 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. రియాసి జిల్లాలోని వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికుల బేస్ క్యాంప్ అయిన కత్రాలో 14 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 48 గంటల్లో జమ్మూ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.