చెన్నై: తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ్పల్లి (Sandaipalli) వద్ద బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై (NH 44) ట్రావెలర్ వ్యాను టైరు పంక్చర్ అయింది. దీంతో రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్.. టైరును మరుస్తున్నాడు. ప్రయాణికులు వ్యాన్ దిగి పక్కన నిల్చున్నారు. ఈ క్రమంలో వెనుకనుంచి వచ్చిన డీసీఎం దానిని ఢీకొట్టింది. రోడ్డుకు అవతలివైపునకు వెళ్లి బోల్తా కొట్టింది. దీంతో అక్కడే నిల్చున్న వారిలో ఏడుగురు మహిళలు మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ సహా 10 మందిని రక్షించి దవాఖానకు తరలించారు. మృతులంతా తమిళనాడులోని వెల్లోరు జిల్లా అంబూరుకు సమీపంలో ఉన్న ఒనన్గుట్టై గ్రామానికి చెందినవారని చెప్పారు. ఈ నెల 8న గ్రామానికి చెందిన 45 మంది రెండు వ్యాన్లలో కర్ణాటకలోని ధర్మస్థలకు వెళ్లారని, తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.