ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. మొత్తం ఏడు మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ ముంబైలోని నానాచౌక్ ఏరియాలోగల 20 అంతస్తుల కమలా బిల్డింగ్లో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 18వ అంతస్తులో మంటలు చెలరేగి ఒక్కసారిగా అంతటా విస్తరించాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలంటుకుని క్షతగాత్రులైన 23 మందిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం క్షతగాత్రుల్లో 14 మందిని సమీపంలోని భాటియా ఆస్పత్రికి తరలించారు.
వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఒకరు ఐసీయూలో మిగతా 12 మంది జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఏడు మందిని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన నాయర్ ఆస్పత్రికి తరలించగా ఏడుగురు మృతిచెందారు. మరో ఇద్దరిని కస్తూర్బా ఆస్పత్రిలో చేర్పించగా ఒకరు మరణించారు. కాగా, ఈ ప్రమాదాన్ని లెవల్-3 అగ్నిప్రమాదంగా అధికారులు పేర్కొన్నారు. మొత్తం 13 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు.