Udhav Thackeray | శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు మంగళవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిజమైన శివసేన ఎవరిదో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించవచ్చునని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తనదే అసలైన శివసేన అని, పార్టీని, పార్టీ గుర్తును తనకు కేటాయించాలని ఎన్నికల సంఘం ముందు పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మంగళవారం సుప్రీంకోర్టు కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా ఉద్ధవ్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టి పారేసింది.
బాల్ఠాక్రే స్థాపించిన శివసేనలో ఏక్నాథ్ షిండే సారధ్యంలో తిరుగుబాటు చేయడంతో జూన్లో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏక్నాథ్ షిండే ముందుకు వచ్చారు. జూన్ 30న మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే, షిండే సర్కార్ చిక్కుల్లో పడుతుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు నిజమైన శివసేన ఎవరిదో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించజాలదని ఉద్ధవ్ వాదించారు. కానీ, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది, 18 మంది ఎంపీల్లో 12 మంది సీఎం ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్నారు.