బెంగళూరు, నవంబర్ 8: కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అవినీతి కంపు కొడుతున్నది. తాజాగా రెండు భారీ అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చాయి. అందులో ఒకటి ప్రతిష్ఠాత్మకమైన కర్ణాటక స్టేట్ ఎలక్ట్రానిక్స్ డైవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ది (కేఈవోఎన్ఐసీఎస్) కాగా, మరొకటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ కుంభకోణం. ఈ బాగోతాలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్నది.
బిల్లు రావాలంటే కమీషన్ కక్కాల్సిందే
కేఈవోఎన్ఐసీఎస్లో కమీషన్ల బాగోతం రాజకీయ రగడ సృష్టిస్తున్నది. రాష్ట్రంలోని ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలకు ఈ సంస్థ మౌలిక వసతులు కల్పిస్తుంది. దీని పరిధిలో వందలమంది చిరు వ్యాపారులు పనిచేస్తున్నారు. వీరు చేసిన పనులకు సంబంధించి ప్రతి నెలా బిల్లులు సమర్పించి డబ్బు తీసుకొంటారు. ఈ సంస్థ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే పరిధిలోనే ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సంగప్ప అనే ఐఏఎస్ అధికారిని ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఆయన అప్పటికే అనేక అవినీతి ఆరోపణలతో సస్పెండయ్యాడు. చిరు వ్యాపారులు సమర్పించే బిల్లుల మొత్తంలో 10-12 శాతం కమీషన్ ఇవ్వందే ఫైల్పై సంతకం పెట్టే ప్రసక్తే లేదని సంగప్ప తెగేసి చెప్తున్నారడని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమంటే.. తాను ఈ పోస్టు కొనుక్కొనేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పానని.. మరి ఆ డబ్బును రాబట్టుకోవాలి కదా అని అంటున్నారని కియానిక్స్ వెండార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వసంత్ బంగేరా తెలిపారు. ఎండీ వేధింపులను నిరసిస్తూ వ్యాపారులు గత శనివారం ధర్నా నిర్వహించారు. ‘సంస్థలో ఓ మాఫియా మొదలైంది. ఎండీ పోస్టు కోసంభారీ మొత్తంలో ఖర్చు చేశానని, ఆ మొత్తాన్ని బిల్లుల్లో నుంచి కట్ చేసుకొంటానని ఎండీ సంగప్ప చెప్తున్నారు. ఈ వ్యాపారంలో మాకొచ్చేదే 5-6 శాతం లాభాలు. అంత మొత్తం లంచాలు మేము ఎక్కడి నుంచి తేవాలి?’ అని వసంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ కమీషన్ స్కెచ్ రూ.300 కోట్లు. ఒక్కో వ్యాపారి నుంచి కనీసం 10 శాతం కమీషన్ వసూలు చేసినా ప్రస్తుతం పెండిండ్లో ఉన్న బిల్లుల కమీషన్ కలిపితే 300 కోట్లు అవుతుందట.
ఎండీ పోస్టు అమ్మిందెవరు?
కియోనిక్స్ కమీషన్ రాజ్పై దుమారం రేగుతున్నది. ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కిందనే ఈ సంస్థ పనిచేస్తుంది. అంటే ఆయనకు తెలియకుండా ఎండీ నియామకం జరగదు. ఎండీ మరి ఆ పోస్టును ఎవరి దగ్గర కొన్నారు? ఈయనకు ఎవరు అమ్మారు? ఎంతకు అమ్మారు? ఇప్పుడు కర్ణాటకలో ఈ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలతోపాటు ప్రజలు కూడా ఈ ప్రశ్నలకు ప్రియాంక్ ఖర్గేవైపే వేలు చూపిస్తున్నారు. పదవీ కాలం ముగిసే నాటికి ఎండీ ఎంత వసూలు చేస్తారో లెక్క దొరకటం లేదని సామాన్యులు పేర్కొంటున్నారు. ఇంత బాహాటంగా ఒక అధికారి కమీషన్లు వసూలు చేయటం మంత్రి, ఆ పై స్థాయి వ్యక్తుల అనుమతి లేకుండా సాధ్యం కాదని అంటున్నారు.
కంపెనీ పెట్టనే లేదు.. లక్షల టన్నుల రీసైక్లింగ్
కర్ణాటకలో ప్లాస్టిక్ కంపెనీలకు వాడేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ కోసం కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఇస్తుంది. ఎన్విరో రీసైక్లీన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కూడా ఓ సర్టిఫికెట్ ఇచ్చేసింది. అదేంటంటే సదరు సంస్థ ఏడాది కాలంలో 3.48 లక్షల టన్నుల ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేస్తుందని. సర్టిఫికెట్ జారీ చేసిన 7 రోజుల్లో రీసైక్లింగ్ మొదలవుతుందని స్పష్టంగా రాశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదుపై నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆ సంస్థలో తనిఖీలు చేయగా.. అక్కడి చిత్రం చూసి అవాక్కయ్యారు. అక్కడ ప్లాంటు లేదు.. రీసైక్లింగూ లేదు. అంటే ఆ కంపెనీని తనిఖీ చేయకుండా రాష్ట్ర అధికారులు అనుమతులు ఇచ్చేశారు.
కేంద్రం 2022లో ఈపీఆర్ నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ విక్రయించిన మొత్తం ప్లాస్టిక్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం రీసైక్లింగ్ చేయాలి. అందుకు అన్ని మౌలిక శాస్త్రీయ వసతులు ఉన్నట్టు రాష్ర్టాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లు సర్టిఫికెట్లు జారీచేయాలి. నిబంధనలు అతిక్రమించిన సంస్థలకు భారీగా జరిమానా విధిస్తారు. కర్ణాటకలో పునాదులు వేస్తున్న సంస్థకు మూడున్నర లక్షల టన్నుల రీసైక్లింగ్ కోసం అనుమతులు ఇచ్చేశారు. దీంతో సదరు సంస్థకు టన్నుకు రూ.5 వేల చొప్పున పెనాల్టీ విధించాలని కేంద్ర అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ లెక్కన రూ.174 కోట్లు పెనాల్టీ పడుతుంది.