America | న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనేది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. ప్రపంచ స్థాయి విద్యతోపాటు కెరీర్ అవకాశాలు మెండుగా ఉంటాయనేది వారి ఆశ. అయితే యూఎస్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు భారతీయ విద్యార్థులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వరుసగా భారత విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతుంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది మూడు నెలల కాలంలోనే 11 మంది భారత విద్యార్థులు మృతిచెందారు. వీరంతా 25 ఏండ్లు లేదా అంతకంటే తక్కువ వయసు వారే కావడం గమనార్హం. గత నెల రోజులుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ మృతదేహాన్ని అమెరికా అధికారులు మంగళవారం ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్లో గుర్తించా రు. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాలో భారతీయ విద్యార్థుల మృతికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. డబ్బులు కోసం లే దా వ్యక్తిగత కారణాలతో జరిగే దాడులకు మన విద్యార్థులు బాధితులుగా మారుతున్నారు.
విద్యార్థుల మరణాలకు కారణాలను గుర్తించిన ఓ ప్రముఖ ప్రవాస భారతీయ సంఘం.. తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం, యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలను కోరింది. విద్యార్థుల మృతి ఘటనలకు అనుమానాస్పద కాల్పులు/కిడ్నాపింగ్, భద్రతాపరమైన పరిజ్ఞానం లేకపోవడంతో (మోనాక్సైడ్ పాయిజనింగ్, అల్పోష్ణస్థితి) జరిగే పర్యావరణ మరణాలు, ఆత్మహత్యలను ప్రేరేపించే మానసిక సమస్యలు, అనుమానాస్పద రోడ్డు ప్రమాదాల నుంచి హింసాత్మక నేరాలు వంటివి కారణాలుగా ఉన్నాయని ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్) తన అధ్యయనంలో గుర్తించింది.
ఒక్కసారిగా పెరిగిన భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళనకరమని, అనుమానాస్పదమని సంబంధిత డాటా సేకరించిన బోస్టన్లో నివాసం ఉండే తలంకి లక్ష్మి పేర్కొన్నారు. పలువురు విద్యార్థుల మరణాల వెనుక విద్వేషపూరిత నేరాలు కూడా ఉండే అవకాశం ఉన్నదనే భయాందోళనలు ప్రవాస భారతీయ సమాజంలో వ్యక్తమవుతున్నది. ప్రధానంగా అమెరికా తూర్పు, మధ్య పశ్చిమ యూనివర్సిటీల్లో.. అది కూడా ఓహియోలోని క్లీవ్లాండ్, ఇల్లినాయిస్, ఇండియానా రాష్ర్టాల్లో ఈ ఘటనలు చోటుచేసుకొంటున్నాయి.
మహ్మద్ అబ్దుల్ మృతదేహం లభ్యమయ్యే కంటే ముందు గద్దె ఉమా సత్యసాయి అనే మరో భారతీయ విద్యార్థి ఇటీవల క్లీవ్లాండ్లో చనిపోయారు. సాయి మరణానికి గల కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది అమెరికాలో మరణించిన భారతీయ విద్యార్థుల వివరాలు పరిశీలిస్తే.. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకొంటున్న ఏపీకి చెందిన పరుచూరి అభిజిత్(20) అనే విద్యార్థి మృతదేహం క్యాంపస్ పరిధిలోని అడవిలో ఓ కారులో గుర్తించారు.
డబ్బులు, ల్యాప్టాప్ కోసం అతనిపై దాడి చేశారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జనవరి 3న వివేక్ సైనీ(25) జార్జియాలో హత్యకు గురయ్యాడు. ఒక స్టోర్లో పనిచేస్తున్న అతనిపై డ్రగ్స్కు బానిసైన జులియన్ ఫాల్కనర్ అనే వ్యక్తి సుత్తితో 50 సార్లు దాడి చేసి కిరాతకంగా హత్యచేశాడు. జనవరి 17న మరణించిన నీల్ ఆచార్య మృతికి వెనుక కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఇంకా పలువురు విద్యార్థులు అల్పోష్ణ స్థితి, ఇతర కారణాలతో మరణించారు.