కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయని పక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్కు ఇవే చివరి ఎలక్షన్లు అవుతాయి అంటూ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇందులో కనిపిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శనివారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా రట్లం జిల్లాలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ఒకరినొకరు కలుసుకోవడానికి మీరెవ్వరూ ఇష్టపడటం లేదు. ఒకరు ఒక ప్రదేశంలో ఉంటే.. మరొకరు మరో ప్రదేశం.. ఇంకొకరు ఇంకో ప్రదేశంలో ఉంటున్నారు. ఇలా చేస్తే పనులు కావు. ఎన్నికల్లో నిజాయితీగా పనిచేయని పక్షంలో, మనకు ఇవే చిట్టచివరి ఎన్నికలవుతాయి జాగ్రత్త. లేదంటే ఇంట్లో కూర్చోండి. ఇక.. కాంగ్రెస్ అధికారంలోకి రాదు. దీంతో ఇక మీకు కార్యకర్తలు కూడా దొరకరు’ అంటూ దిగ్విజయ్ సింగ్ స్థానిక నేతలను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.