న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: భారత న్యాయవ్యవస్థలో భీష్మ పితామహుడిగా పేరు గడించిన ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్ నారీమన్ (95) బుధవారం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలకు తోడు గుండెపోటు రావటంతో ఆయన తుడిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. పౌర హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకక విధానం కాపాడేందుకు జీవితాంతం శ్రమించిన నారీమన్కు.. ఏ ప్రభుత్వాలపైన అయినా ధైర్యంగా తన అభిప్రాయాలు వ్యక్తీకరిస్తారన్న పేరు ఉన్నది. ఆయన ఎంతోమంది న్యాయవాదులు, న్యాయమూర్తులకు మెంటార్గా కూడా పనిచేశారు. ఆయన కెరీర్లో దాదాపు సగం కాలం కేంద్ర ప్రభుత్వానికి సొలిసిటర్ జనరల్గా, అటార్నీ జనరల్గా సేవలందించారు.
సుప్రీంలో సుదీర్ఘ ప్రయాణం
ఫాలీ ఎస్ నారీమన్ మయన్మార్లోని రంగూన్ (యాంగాన్)లో వ్యాపార కుటుంబంలో జన్మించారు. 1950లో బాంబేలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1972లో ఢిల్లీకి తరలివెళ్లి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1972, మేలో నారీమన్ను అదనపు సొలిసిటర్ జనరల్గా నియమించారు. 1975, జూన్ 26న ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించటంతో ఆ మరుసటి రోజే నారీమన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన భారతదేశ సొలిసిటర్ జనరల్గా, అటార్నీ జనరల్గా సుదీర్ఘకాలం సేవలందించారు. 1991 నుంచి 2010 వరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ న్యాయ సంస్థల్లో సభ్యుడిగా కొనసాగారు. నారీమన్ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలిచ్చి సత్కరించింది. భారత న్యాయవ్యవస్థలో ల్యాండ్మార్క్ వంటి అనేక కేసులను ఆయన వాదించారు. రాజ్యాంగ ‘మౌలిక లక్షణం’పై తొలిసారి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కేశవానంద భారతి కేసులో ప్రముఖ న్యాయవాది నానాభాయ్ పాల్కీవాలాకు నారీమన్ సహాయకుడిగా పనిచేశారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కేసులో యూనియన్ కార్బైడ్ తరఫున వాదించిన ఆయన, ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం తెచ్చిన ఎన్జేఏసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించి విజయం సాధించారు. నర్మదా డ్యాం కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించినా, ఆ తర్వాత ఆ ప్రాంతంలో క్రైస్తవులపై దాడుల నేపథ్యంలో తన వకాల్తాను ఉపసంహరించుకొన్నారు. నారీమన్ మృతికి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, ప్రధాని నరేంద్రమోదీ, మాజీ సీజేఐ ఎన్వీ రమణ తదితరులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప మేధావిని, న్యాయకోవిదుడిని కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు.