Railway Engineer | ఇటీవల ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద విద్యుద్ఘాతంతో మహిళ దుర్మరణం కేసులో భారతీయ రైల్వేస్ సీనియర్ ఇంజినీర్ భరత్ భూషణ్ (40)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కిషాన్ గంజ్ లోని రైల్వే క్వార్టర్స్ నివసిస్తున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ వద్ద ఎలక్ట్రిక్ స్తంభాల మెయింటెనెన్స్ బాధ్యత సీనియర్ ఇంజినీర్ భరత్ భూషణ్దేనని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఈ నెల 27న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద విద్యుద్ఘాతం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించామని డీసీపీ (రైల్వేస్) అపూర్వ గుప్తా చెప్పారు. ఘటనా స్థలాన్ని తనిఖీ చేసిన తర్వాత మరమ్మతు పనుల నిమిత్తం రైల్వేశాఖకు అప్పగించామని తెలిపారు. ఇదిలా ఉంటే, తమతోపాటు దర్యాప్తులో పాల్గొనాలని భరత్ భూషణ్ ను కోరామన్నారు. విచారణ అనంతరం సీఆర్పీసీ సెక్షన్ 41.1ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.
ఆదివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ వద్దకు వెళ్లిన సాక్షి అహుజా (34) విద్యుత్ వైర్ను తాకి మరణించిన సంగతి తెలిసిందే. వర్షం కురుస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ కు వస్తున్న సాక్షి అహుజా.. బ్యాలెన్స్ తప్పి, విద్యుత్ స్తంభాన్ని తాకింది. అప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్న వైర్ ఆమెను అంటుకోవడంతో విద్యుద్ఘాతంతో అక్కడికక్కడే మరణించారు. దీనిపై ఆమె భర్త అంకిత్ అహుజా స్పందించారు. రైల్వేశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని ఆరోపించాడు. ఇందుకు కారకులైన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై ఐపీసీలోని 287, 304 ఏ సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.