క్షమాపణ చెప్పటానికి సావర్కర్ను కాను
గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వాడిని
ప్రధాని మోదీ, అదానీకి మధ్య ఎప్పట్నుంచో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నిజాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకొస్తున్నందునే ప్రధాని మోదీ భయపడతున్నారు. అదానీ అంటే దేశమన్నట్టు మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నది. వారి అనుబంధం దేశ వ్యవస్థలను నడిపిస్తున్నది. -రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని, ఈ అంశంపై ప్రశ్నించినందునే తన పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు విధించారని మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు అనంతరం శనివారం న్యూఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి జరుగుతున్నదని చెప్పడానికి తన అనర్హత వేటు ఒక ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘డొల్ల కంపెనీల ద్వారా రూ.20 వేల కోట్లు అదానీ కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలివెళ్లాయి. ఇది ఎవరి డబ్బు? దీనికి మోదీ సర్కార్ సమాధానం చెప్పాలి. అదానీ కంపెనీలో చైనా పెట్టుబడులున్నాయా? లేదా? అనర్హత వేటు వేసి, జైల్లో నిర్బంధించి బీజేపీ నన్ను భయపెట్టాలని చూస్తున్నది. అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ సర్కార్ ఆడుతున్న డ్రామా ఇదంతా. కేంద్రమంత్రులు నాపై చేస్తున్న ఆరోపణలు కూడా అందుకే’ అని రాహుల్ వెల్లడించారు.
అనర్హత వేటు, జైలుకు పంపటం.. ఇవేమీ తన పోరాటాన్ని ఆపలేవని రాహుల్గాంధీ అన్నారు. జీవితాంతం జైల్లో పెట్టినా, ఇలాగే ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా. ఎంపీగా ఉన్నా, లేకున్నా నాది ఇదే పంథా’ అని అన్నారు. పరువునష్టం కేసులో దోషిగా తేలారు, అనర్హత వేటు పడింది.. ఇప్పటికైనా క్షమాపణలు చెప్తారా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘నా పేరు సావర్కర్ కాదు. నాది గాంధీ కుటుంబం. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’ అని సమాధానమిచ్చారు.
ప్రధాని మోదీ, అదానీకి మధ్య ఎప్పట్నుంచో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, ఈ నిజాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకొస్తున్నందునే ప్రధాని మోదీ భయపడతున్నారని రాహుల్ తెలిపారు. ‘అనర్హత వేటు ద్వారా మాకు రాజకీయం ఆయుధం లభించింది. అదానీ వ్యవహారంపై ప్రజల మనసుల్లోనూ ప్రశ్నలున్నాయి. అదానీ అక్రమాలకు పాల్పడ్డాడన్నది మోదీ సర్కార్కు తెలుసు. అయినా ప్రధాని మోదీ ఆయనను ఎందుకు కాపాడుతున్నాడన్నది అసలు ప్రశ్న. దేశమంటే అదానీ, అదానీ అంటే దేశమన్నట్టు మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నది. వారి అనుబంధం దేశ వ్యవస్థలను నడిపిస్తున్నది’ అని వివరించారు.
‘2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు ఓబీసీల మనోభావాల్ని దెబ్బతీశాయి, ఓబీసీలను కించపర్చారని కేంద్రమంత్రులు ఆరోపించారు. కానీ ఓబీసీలను కించపరుస్తూ నేనెప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు. పరువునష్టం కేసుకు, ఓబీసీలకు ఎలాంటి సంబంధమూ లేదు. అదానీ, ప్రధాని మోదీ సన్నిహిత సంబంధాలతో ముడిపడిన కేసు ఇది. కాబట్టి ఎవ్వరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు’ అని వెల్లడించారు.
వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తున్నదని, ఉప ఎన్నిక నిర్వహణపై ఈసీలో మేథోమథనం జరుగుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. వయనాడ్ స్థానంపై ఏప్రిల్లో ఈసీ ప్రకటన రావొచ్చునని తెలుస్తున్నది. పరువునష్టం కేసులో రాహుల్గాంధీని దోషిగా తేల్చటం, ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు విధించటం కొన్ని గంటల వ్యవధిలో జరిగిపోయాయి. ‘వయనాడ్’ నియోజివర్గం ఖాళీ అయ్యిందని లోక్సభ కార్యదర్శి శుక్రవారం ప్రకటించారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్గాంధీ పై కోర్టుకు వెళ్తారా? స్టే ఉత్తర్వులు వస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.