న్యూఢిల్లీ, మే 29: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1962లో జరిగిన భారత్ – చైనా యుద్ధంపై ఆయన మాట్లాడుతూ… ‘1962 అక్టోబర్లో భారత్పై చైనా బలగాలు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిన విషయం తెలిసినప్పటికీ ఇలా ‘ఆరోపణ ఉన్నట్టుగా’ అంటూ అయ్యర్
చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ భారత వ్యతిరేక వైఖరికి అయ్యర్ వ్యాఖ్యలే నిదర్శనమని బీజేపీ మండిపడింది.
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మణిశంకర్ అయ్యర్ క్షమాపణలు చెప్పారు. తన ప్రసంగంలో పొరపాటున ‘ఆరోపణ’ అనే పదం పలికానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అయ్యర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. 1962 అక్టోబరు 20న భారత్లో చైనా ఆక్రమణ నిజమని, అలాగే 2020 మేలో లఢక్లో చైనా చొరబాటు కూడా నిజమని, 20 మంది భారత సైనికులు అమరులయ్యారనేది నిజమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. కాగా, మణిశంకర్ అయ్యర్ తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్కు తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల ఆయన ఓ సందర్భంగా మాట్లాడుతూ… ‘పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉన్నందున భారత్ ఆ దేశాన్ని గౌరవించాలని, లేకపోతే భారత్పై అణుబాంబును ఉపయోగించే అంశాన్ని పాక్ ఆలోచిస్తుంది’ అని అయ్యర్ వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.