ముంబై : రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖాముఖి భేటీపై స్పందిస్తూ శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత సంబంధాలు, ప్రొటోకాల్ లో భాగంగానే ప్రధాని మోదీతో ఠాక్రే సమావేశమయ్యారని శివసేన స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాషాయ పార్టీతో తెగతెంపులు చేసుకున్న శివసేన ఆపై ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
సేన, బీజేపీల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన క్రమంలో ప్రధాని మోదీతో ఉద్ధవ్ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఠాక్రే ఢిల్లీ పర్యటన రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదని, మహారాష్ట్రలో పెండింగ్ ప్రాజెక్టులు ఇతర పనులను కేంద్రం నుంచి సాధించుకునేందుకే ఆయన హస్తిన టూర్ సాగిందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన పేర్కొంది. ప్రధానితో ఠాక్రే భేటీ సామరస్య వాతావరణంలో ఫలవంతంగా జరిగిందని స్పష్టం చేసింది.