ముంబై : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లతో కూడిన ఎంవీఏ సర్కార్పై సేన ఎంపీ గజానన్ కీర్తికార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి భాగస్వామ్య పక్షం ఎన్సీపీపై అసహనం వ్యక్తం చేశారు. రత్నగిరిలోని దపోలిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఠాక్రే సర్కార్గా పిలుస్తారు కానీ..వాస్తవంగా ప్రయోజనాలు మాత్రం పవార్ సర్కార్కు దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబైలో సీఎం, నగర్ వికాస్ నిధులతో తగినన్ని నిధులు లభ్యమవుతున్నా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పలు గ్రామాల బాగోగులను చూసుకోవాల్సి ఉంటుందని ఈ క్రమంలో తనకు చేతనైన సాయం తాను చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు తీవ్ర పోటీ నెలకొందని అంటూ పేరుకు ఠాక్రే సర్కార్ అయినా వాస్తవంగా పవార్ సర్కార్కే మేలు జరుగుతోందని ఎన్సీపీ తీరును దుయ్యబట్టారు.
ఇక ఎంవీఏ సర్కార్లో తగినన్ని నిధులు మంజూరు కావడం లేదంటూ శివసేన, కాంగ్రెస్ మంత్రులు సైతం పలు సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. ఇక శివసేన, కాంగ్రెస్ కంటే ఎన్సీపీనే ఠాక్రే సర్కార్లో ఎక్కువగా నిధులు రాబడుతోందని అసెంబ్లీలో విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ సైతం గతంలో వ్యాఖ్యానించారు.