ముంబై : బాయ్కాట్ ట్రెండ్ పేరిట విద్వేష వ్యాప్తిపై బాలీవుడ్ సెలబ్రిటీలు మౌనం దాల్చుతున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. బాలీవుడ్ సెలబ్రిటీలు విద్వేషంపై గొంతెత్తకుండా ఉంటే వారి మౌనం వారిని కాపాడలేదని అన్నారు. బాలీవుడ్ సినిమాలపై సోషల్ మీడియాలో ఇటీవలి బాయ్కాట్ ట్రెండ్ను ఆమె స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో గతంలో బాలీవుడ్ సెలబ్రిటీల ఫోటోను ఆమె ట్విట్టర్లో షేర్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.
విద్వేషంపై మీరు మౌనం దాల్చి రాజకీయాలు మన వ్యవహారం కాదని పెదవివిప్పనంత కాలం ఇలాంటి ఫోటో షోలు మీకు సాయపడవని ప్రియాంక చతుర్వేది స్పష్టం చేశారు. వారు మిమ్మల్నీ విడిచిపెట్టరని హెచ్చరించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాళి ఆలయంలోకి బాలీవుడ్ కపుల్ రణబీర్కపూర్, అలియా భట్లను రాకుండా నిరసనకారులు అడ్డగించిన ఘటనను ఆమె ప్రస్తావించారు.
రాజకీయాలు ఇలాంటి స్ధాయికి దిగజారడం సిగ్గుచేట్టన్నారు.బీఫ్ తినడంపై గతంలో రణ్బీర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డగించారు. రణ్బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీ విడుదలకు ముందు ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రతి సినిమా విడుదలకు ముందు ఉద్దేశపూర్వకంగా నిరసనలకు పూనుకోవడాన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ప్రియాంక చతుర్వేది అన్నారు. వినోద పరిశ్రమపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారని, ఇది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని మీరంతా గొంతెత్తాలని బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆమె పిలుపు ఇచ్చారు.