బెంగళూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హిజాబ్ వివాదం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా హిజాబ్ కేసుకు సంబంధించిన పత్రాల కాపీలను పిటిషనర్ల అడ్రస్లతో సహా బీజేపీ కర్నాటక విభాగం ట్వీట్ చేయడం దుమారం రేపింది. కాషాయ పార్టీ చర్య నేరపూరితమైనదని, సిగ్గుచేటని శివసేన నిప్పులు చెరిగింది. విపక్షాలపై దాడి చేసేందుకు బీజేపీ మైనర్ బాలికల చిరునామాలను ట్వీట్ చేసిందని, ఇది ఆ పార్టీ దిగజారుడుతనానికి, అమానవీయ ధోరణికి అద్దం పడుతోందని శివసేన నేత ప్రియాంక చతుర్వేది మంగళవారం పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టాలని ఆమె కర్నాటక డీజీపీకి విజ్ఞప్తి చేయడంతో పాటు ట్వీట్ను తొలగించాలని ట్విట్టర్ను కోరారు. మరోవైపు స్కూళ్లలో హిజాబ్ ధరించడంపై హైకోర్టు ప్రతిపాదనల ఆధారంగా కర్నాటక ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీచేసే అవకాశం ఉంది.
ఇక హిజాబ్ వ్యవహారంపై కర్నాటక హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హిజాబ్ ఓ మతం సారాంశంలో బాగమని పిటిషనర్ న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లారు. పిటిషనర్ తన వాదనలకు మద్దుతగా విదేశీ కోర్టుల తీర్పులను ప్రస్తావించారు. ఇక ఉడిపి మహిళా ప్రీ యూనివర్సిటీ కాలేజీలోకి హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్ధినులను అనుమతించకపోవడంతో ఈ ఏడాది జనవరి 1న కర్నాటకలో హిజాబ్ వివాదం మొదలైంది. ఆపై ముస్లిం యువతులు తరగతి గదులకు హిజాబ్తో రావడం, అందుకు ప్రతిగా హిందూ విద్యార్ధులు కాషాయ శాలువాలు కప్పుకుని వచ్చిన ఘటనలు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలకు దారితీయడంతో మూడు రోజుల పాటు విద్యాసంస్ధల మూసివేతకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ వ్యవహారంపై ముస్లిం బాలికలు కొందరు కర్నాటక హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అంతకుముందు హిజాబ్ వివాదం అర్ధరహితమని బిహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. బిహార్లో అన్ని స్కూళ్లలో ఒకే రకమైన దుస్తులను విద్యార్ధులు ధరిస్తారని..కొందరు తమ తలపై ఏదో ఒకటి (హిజాబ్ లేదా చందనం) ధరిస్తే దానిపై మనం ఏం చేస్తామని ఆయన ప్రశ్నించారు. ప్రజలందిరికీ వారిదైన జీవన విధానం ఉంటుందని..అందులో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోరాదని అన్నారు.