న్యూఢిల్లీ, జూలై 5: కరోనా అనిశ్చితి కారణంగా పరీక్షలు రద్దు అవుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకొన్నది. వచ్చే ఏడాది 10, 12వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపునకు ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నట్టు ప్రకటించింది. ఈ విధానంలో.. విద్యాసంవత్సరాన్ని రెండు సెమిస్టర్లు(టర్మ్లు) విభజించింది. అందుకు అనుగుణంగా సిలబస్ను కూడా హేతుబద్ధంగా విభజించనున్నట్టు ప్రకటించింది. అవసరమైతే సిలబస్ను కుదిస్తారు. మొదటి టర్మ్ పరీక్షలు నవంబర్-డిసెంబర్లో, రెండో టర్మ్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. తాజా విధానం ప్రకారం ఒక్కో టర్మ్లో మూడు యూనిట్ టెస్టులు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ మార్కులను ఎప్పటికప్పుడు సీబీఎస్ఈకి పంపించాలి. టర్మ్ 1 పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. అన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఉంటాయి. టర్మ్ 2 పరీక్ష వ్యవధి రెండు గంటలు. పరిస్థితులు అనుకూలించ కపోతే టర్మ్ 2 పరీక్షను కూడా టర్మ్ 1 పరీక్షలాగే అబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలు, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ ఆధారంగా తుది ఫలితాలు వెల్లడిస్తారు.