Seerat Naaz | కూర్చోడానికి బెంచీలు లేవు.. సరైన మరుగుదొడ్లు లేవు.. ఇతర సౌకర్యాలూ అంతంత మాత్రమే. ఇదంతా గత ఐదేండ్ల నుంచి చూస్తూ విసిగి వేసారిన ఒక చిన్నారి మోదీ సార్.. ఇదేం స్కూల్? ఒకసారి చూడండి.. కనీసం మీరైనా దీనిని బాగు చేయించండి అంటూ జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) కథువాలో (Kathua) ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే సీరత్ నాజ్ (Seerat Naaz) అనే బాలిక తన స్కూల్ దుస్థితిని వీడియో తీసి ప్రధాని మోదీకి (PM Modi) పంపింది. ఆ వీడియో వైరల్గా (Viral video) మారడంతో అధికారుల్లో చలనం వచ్చింది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు పనులు ప్రారంభించారు.
లోహై-మల్హార్ (Lohai-Malhar) బ్లాక్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో సీరత్ నాజ్ అనే చిన్నారి మూడో తరగతి చదవుతున్నది. ఈ నెల 14న ఆ స్కూల్లో కనీస వసతులు లేకపోవడంతో.. పాఠశాల బిల్డింగ్ను చూపిస్తూ ఫోన్లో వీడియోను రికార్డు చేసింది. ‘మోదీ సార్.. ఇదేం స్కూల్? ఒకసారి చూడండి.. కనీసం మీరైనా దీనిని బాగు చేయించండి. తమకొక స్కూల్ను నిర్మించాలంటూ అభ్యర్థించింది. స్కూల్లో బెంచీలు, టాయిలెట్లు లేవని పేర్కొన్న ఆమె.. సగం మాత్రమే పూర్తయిన స్కూల్ బిల్డింగ్ను, దుమ్ముతో నిండిన స్కూల్ పరిసరాలు, మట్టితో ఉన్న నేలను చూపింది. బెంచీలు లేక కిందే కూర్చోవాల్సి వస్తున్నదని, నేలంతా దుమ్ము, ధూళితో ఉండటం వల్ల యూనిఫాం మురికిగా మారుతున్నదని, అది చూసి తమ తల్లులు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దీంతో జమ్ము స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవి శంకర్ శర్మ (Ravi Shankar Sharma) లోహై-మల్హార్లో ఉన్న ఆ స్కూల్ను సందర్శించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో ఆధునిక వసతులు కల్పించడానికి రూ.91 లక్షలు విడుదల చేశాం. అయితే పరిపాలనా అనుమతులు రాకపోవడంతో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. జమ్ము ప్రావిన్స్లోని అన్ని జిల్లాలో వెయ్యి కిండర్గార్టెన్లను (kindergartens) నిర్మిస్తున్నామని శర్మ వెల్లడించారు. వచ్చే నాలుగేండ్లలో ప్రతి జిల్లాలో 250 చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు.