Chatish Garh CM Bhupesh Baghel | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భాఘెల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అన్నీ పార్టీలు నిర్వహించే కార్యకలాపాలకు భద్రత కల్పించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి బీజేపీ నక్సల్స్ ప్రభావిత దంతేవాడ ప్రాంతంలో పరివర్తన యాత్ర చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో తమకు భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి ఆ పార్టీ గత వారం లేఖ రాసింది. బస్తర్ రీజియన్ పరిధిలో తమ నేతల హత్యలు జరుగుతున్నందున కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని పేర్కొంది. దీనిపై సీఎం భూపేష్ భాఘెల్ స్పందించారు. ‘2013 ఎన్నికల ముందు ఝీరాం ఘట్టి వద్ద మేం మా నాయకులను కోల్పోయాం. అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుంది` అని తెలిపారు.
ఇటీవల జరిగిన భద్రతాబలగాల యూనిఫైడ్ కమాండ్ సమావేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని పార్టీలకు పూర్తి రక్షణ కల్పించాలని నిర్ణయించాం అని భూపేశ్ భాఘెల్ తెలిపారు. 2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మే 25న బస్తర్ రీజియన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పరివర్తన యాత్రపై మావోయిస్టులు జరిపిన దాడిలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నంద కుమార్ పటేల్, మాజీ విపక్ష నేత మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లా సహా 29 మంది మరణించారు.