ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు అమరావతి పోలీసులు తెలిపారు. నగరంలోని పలు చోట్ల అదనపు బలగాలను మోహరించారు. త్రిపురలో మతపరమైన హింసను వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలోని ముస్లిం సంస్థలు శుక్రవారం చేపట్టిన నిరసన ర్యాలీలు హింసకు దారితీశాయి. అమరావతితోపాటు పలు నగరాల్లో నిరసనకారులు రాళ్లదాడి, విధ్వంసానికి పాల్పడ్డారు. దీనికి ప్రతీకగా బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టారు.
మహారాష్ట్రలో శుక్రవారం నుంచి పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని డీజీపీ సంజయ్ పాండే తెలిపారు. దీంతో కొన్ని ప్రదేశాలలో కమ్యూనికేషన్ షట్డౌన్ చేశామన్నారు. హింస, విధ్వంసానికి పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అరెస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాలలో పాల్గొన వద్దని ప్రజలను కోరారు.
కాగా, త్రిపురలోని గోమతి జిల్లాలో ఒక మసీదు ధ్వంసంపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు ఫేక్ అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇటీవలి కాలంలో త్రిపురలోని ఏ మసీదు నిర్మాణానికి నష్టం జరిగినట్లుగా రిపోర్ట్ రాలేదని పేర్కొంది. కొన్ని సోషల్ మీడియా పోస్ట్లలో ఆరోపించినట్లుగా ఏ వ్యక్తిపై దాడి, అత్యాచారం లేదా మరణం జరుగలేదని చెప్పింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అవాస్తవ ప్రచారాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించవద్దని సూచించింది.