లక్నో: ఉత్తరప్రదేశ్లో కొద్దిరోజుల వ్యవధిలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన యూపీ పోలీసులు.. తాజాగా మరో నిందితుడిని ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ను గత నెల 24న సాయంత్రం ప్రయాగ్రాజ్లో దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ఇప్పటికే ఇటీవల ఒక నిందితుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు.. ఇవాళ షార్ప్ షూటర్ అయిన మరో నిందితుడిని అంతం చేశారు.
కాగా, ఉమేశ్ పాల్ గత నెల 24న తన బాడీగార్డ్స్తో కలిసి ఇంటివద్దకు చేరుకోగానే అప్పటికే అక్కడ కాపుగాసి ఉన్న దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఉమేశ్ పాల్ ప్రాణాలు కోల్పోయాడు. అంతేగాక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అంగరక్షకులు కూడా చికిత్స పొందుతూ ఆ తర్వాత మరణించారు. ఈ హత్యల వెనుక మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ విషయంపై ప్రతిపక్షాలు కూడా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో ‘అహ్మద్ వంటి మాఫియా క్రిమినల్స్ని నిర్మూలిస్తాం’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సభలో ప్రకటన చేశారు. అదేవిధంగా నిందితులపై యూపీ సర్కారు రూ.2.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఉమేశ్పాల్ హత్య కేసు నిందితుల్లో ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
తమ్ముడిని ఓడించాడని బీఎస్పీ ఎమ్మెల్యే హత్య
ప్రయాగ్రాజ్ (అప్పుడు అలహాబాద్) పశ్చిమ స్థానం నుంచి అతీక్ అహ్మద్ 1989 నుంచి 2004 వరకు మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2004-09 వరకు ఫూల్పూర్ ఎంపీగా గెలిచాడు. దాంతో తాను వదిలేసిన అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో సోదరుడు అష్రఫ్ను బరిలో దింపాడు. కానీ, ఆ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజు పాల్.. అతీక్ సోదరుడు అష్రఫ్ను ఓడించాడు. తమ కుటుంబానికి కంచుకోట లాంటి నియోజకవర్గం చేజారిపోవడంతో కక్ష పెంచుకున్న అతీక్ 2005 జనవరిలో హత్య చేయించారు. ఈ హత్యకేసులో అష్రఫ్, అతీక్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2016 నుంచి అతీక్ అహ్మద్ ప్రయాగ్రాజ్ అగ్రికల్చర్ రిసెర్చ్ కేంద్రంలో సిబ్బందిపై దాడి కేసులో గుజరాత్లోని జైలులో ఉన్నాడు.