Eknath Shinde | మహారాష్ట్రలోని సీఎం ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేన-బీజేపీ సర్కార్కు కేవలం 45 రోజుల్లోనే రెండో ఎదురు దెబ్బ తగిలింది. 45 రోజుల క్రితం రూ.1.5 లక్షల కోట్ల విలువ గల వేదాంతా-ఫాక్స్కాన్ ప్రాజెక్ట్ గుజరాత్కు తరలిపోయింది. తాజాగా టాటా సన్స్-ఎయిర్బస్ సంయుక్త ఆధ్వర్యంలో రూ.22 వేల కోట్ల విలువ గల 56 మిలిటరీ రవాణా విమానాల తయారీ ప్రాజెక్ట్ కూడా గుజరాత్కు తరలి వెళ్లింది. భారత వాయుసేనలో కాలం చెల్లిన ఎవియో ఫ్లీట్ విమానాల స్థానే ఎయిర్బస్-టాటా తయారు చేసే రవాణా విమానాలను వినియోగిస్తారు. షిండే సారధ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండి పడ్డాయి.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్కు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే టాటా-ఎయిర్బస్ ప్రాజెక్ట్ తరలి వెళ్లడం అధికార బీజేపీకి లబ్ధిని చేకూర్చేదేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం కొలువు దీరిన ఏక్నాథ్ షిండే సారధ్యంలోని షిండే శివసేన-బీజేపీ కూటమికి రెండో ఎదురు దెబ్బ తగిలినట్లయింది. గత నెల 15న మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ మాట్లాడుతూ వేదంతా ప్రాజెక్ట్ తరలి వెళ్లినా.. టాటా-ఎయిర్బస్ ప్రాజెక్టును నాగ్పూర్లో ఏర్పాటు చేస్తామన్నారు.
కానీ, ఇదే మంత్రి ఉదయ్ సమంత్ తాజాగా మాట మార్చారు. నాగ్పూర్లో టాటా-ఎయిర్బస్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రతిపాదన లేదని చెప్పారు. నాగ్పూర్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. కానీ విజయవంతం కాలేకపోయారని ఉదయ్ సమంత్ చెప్పుకొచ్చారు.
మంత్రి ఉదయ్ సమంత్ ప్రకటనను మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. మూడేండ్ల క్రితం నాగ్పూర్లోని మిహాన్లో భూమి లభ్యత గురించి నాగ్పూర్లోని తమ కార్యాలయంలో సంప్రదించారని ఆ అధికారి చెప్పారు. వారు తమ ఆఫీసును నాలుగు సార్లు సందర్శించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.