UP Polls: ఓ వైపు ప్రియాంక గాంధీ యూపీ ఎన్నికల కోసం కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. మహిళల్ని, యువకుల్ని ఏకం చేయడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. కాస్తో కూస్తో రాహుల్ గాంధీ కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ ఇంత పకడ్బందీగా యూపీ ఎన్నికల్లో చెమటోడ్చుతున్న వేళ.. ఆర్పీఎన్ సింగ్ లాంటి దిగ్గజాన్ని పడగొట్టుకుంది. యూపీ కాంగ్రెస్లో ఆర్పీఎన్ సింగ్ హెవీ వెయిట్. దిగ్గజం కూడా. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఖుషీనగర్లోని పడ్రౌనా నుంచి 1996 నుంచి 2009 వరకూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 లోనే అక్కడి నుంచే ఎంపీగా కూడా గెలుపొందారు. ఆయన రాజకీయ పలుకుబడి, వ్యూహం, సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని అధిష్ఠానం ఆయన్ను స్టార్ క్యాంపెయినర్గా కూడా నియమించింది. ఈ నియామకం జరిగిన తెల్లారే ఈయన పార్టీకి ఝలక్ ఇస్తూ, గుడ్బై చెప్పేశారు.
కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్కు బీజేపీ పెద్ద ఝలక్ ఇచ్చింది. యూపీ బ్రాహ్మణ వర్గంలో కీలక నేత అయిన జితిన్ ప్రసాదను కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిపోవడంతో కాంగ్రెస్ బ్రాహ్మణ ఓటు బ్యాంకు ఆయనతో వెళ్లిపోయింది. ఆ ప్రభావం ఇప్పుడు కాంగ్రెస్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూనే వుంది. బ్రాహ్మణ వర్గం ఓట్ల కోసం అటు బీజేపీ, బీఎస్పీ, ఇటు కొత్తగా ఎస్పీ తీవ్ర ప్రయత్నాలనే చేస్తోంది. ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. జితిన్ ప్రసాద వుండి వుంటే, అది వేరుగా వుండేది. జితిన్ ప్రసాద్ ఝలక్ తర్వాత కాంగ్రెస్కు ఆర్పీఎన్ సింగ్ రూపంలో మళ్లీ ఇప్పుడు ఝలక్ వచ్చి పడింది. అదీ సరిగ్గా ఎన్నికల సమయంలో. ఇది కాంగ్రెస్కు శరాఘాతమేనని ద్వితీయ శ్రేణి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
యూపీ వేదికగా కాంగ్రెస్ పెద్ద తలకాయలను మెళ్లి మెళ్లిగా పోగొట్టుకుంటోంది. 2020 లో యువనేత, రాహుల్ గాంధీ క్లాస్మేట్ జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఇప్పుడు ఆర్పీఎన్ సింగ్. అంటే యూపీ కాంగ్రెస్కు పట్టుకొమ్మలైన సింధియా, జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్ ఇప్పుడు కాంగ్రెస్లో లేరు. వారు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరిపోయారు. విశేషమేమిటంటే ఈ ముగ్గురూ రాహుల్ శిబిరమే. ముగ్గురూ రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరి వారే.