తిరువనంతపురం: క్రాకర్స్ పేల్చడంపై వధు, వరుల వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇది చివరకు కొట్టుకోవడం వరకు దారి తీసింది. దీంతో వివాహ వేడుక రభసగా మారింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మెప్పయ్యూర్ పట్టణంలోని వరుడి ఇంటికి పెళ్లి బృందం చేరింది. ఈ సందర్భంగా వరుడి స్నేహితులు పటాకులు కాల్చారు. అయితే అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన కొందరు యువకులు కొట్టుకున్నారు.
కాగా, ఇతర బంధువులు, స్థానికులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ మరింత పెద్దది కాకుండా కొట్టుకుంటున్న వారిని పెళ్లి వేదిక నుంచి బయటకు పంపారు. చివరకు ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే పెళ్లిలో జరిగిన ఈ ఘర్షణపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరోవైపు ఈ ఫైటింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.