తిరువనంతపురం: కరోనా విజృంభణ కొనసాగుతున్న కేరళలో నవంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని స్కూళ్లకు సమాచారం ఇచ్చారు. తొలుత అక్టోబర్ 4 నుంచి ఉన్నత విద్యా సంస్థలను తెరువాలని భావించారు. అయితే మూడు నెలలుగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతుండటంతో వెనక్కి తగ్గారు.
మరోవైపు కేరళలో హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు మరికొంత కాలం వేచి ఉండాల్సిందేనని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ప్యాక్డ్ ఫుడ్, డ్రింక్స్ను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. కరోనా పరిస్థితి ఆధారంగా సినిమా థియేటర్ల తెరువడంపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. కాగా, కేరళలో శనివారం కొత్తగా 19,325 కరోనా కేసులు, 143 మరణాలు నమోదయ్యాయి.