న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరగా.. వాతావరణ పరిస్థితులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు పాఠశాలలను ప్రత్యక్ష తరగతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలకు ఇబ్బందుల్లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 14-17 తేదీల మధ్య నిర్మాణ కార్యకలాపాలకు అనుమతించబోమని తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వీలైనంత వరకు వర్క్ఫ్రం హోం విధానంలో పని చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో ఒక వారంపాటు వర్క్ఫ్రం హోం విధానంలో పని చేస్తాయని, ప్రైవేటు కార్యాలయాలు ఉద్యోగులకు సైతం వీలైనంత వరకు వర్క్ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. ఢిల్లీలో రెండు రోజులు లాక్డౌన్ పెట్టాలనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో చర్చించి లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు.