న్యూఢిల్లీ : ఉత్తరాదిని చలిపులి వణికిస్తోంది. చలిగాలులతో ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో యూపీ రాజధాని లక్నోలో జనవరి 4 నుంచి 7 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవలు ప్రకటించామని లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వర్ వెల్లడించారు.
రానున్న రోజుల్లో చలిగాలులు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎమర్జెన్సీ సేవల సిబ్బంది మినహా టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలిపారు. కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల బాలికల పాఠశాలలకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పారు.